ఇక నుంచి తమ బిడ్డ కాదు… దేశానికి బిడ్డ: వైభవ్ తండ్రి సంజీవ్
పట్నా: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడి అత్యధిక పరుగులు చేసి రికార్డులు సృష్టించాడు. ఈ యువ హిట్టర్ సూర్యవంశీ టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. దేశం తరఫున ఆడాలన్న యువ క్రికెటర్, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ కల నెరవేరింది. భారత సీనియర్ టీ20 జట్టు (ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటన)కు ఎంపికైన బిహారీ కుర్రాడిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా వైభవ్ తండ్రి సంజీవ్ తన కుమారుడి క్రికెట్ జర్నీని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనలయ్యారు. జాతీయ జట్టుకు ఎంపికయ్యే వరకు వైభవ్ పడిన కష్టాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘చిన్నప్పటి నుంచే భారత జట్టుకు ఆడాలనే బలమైన లక్ష్యంతో వైభవ్ కష్టపడ్డాడు. వాడిలోని ఆ పట్టుదల చూసి, పూర్వీకుల భూమిని అమ్మి మరీ శిక్షణ ఇప్పించాను’ అని సంజీవ్ పేర్కొన్నారు. వాడు ఇప్పటివరకు తన కొడుకని, నేటి నుంచి దేశానికి బిడ్డ అని గర్వంగా చెప్పారు. తమకు డబ్బు కంటే దేశానికి ఆడి తెచ్చే గౌరవమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. వైభవ్ జాతీయ జట్టుకు ఎంపికైన బీసీసీఐ నుంచి తమకు పత్రాలు వచ్చాయని, తాము ఇంగ్లండ్ వెళ్తున్నామని సంజీవ్ పేర్కొన్నారు. కేవలం 15 ఏళ్లకే సచిన్ టెండూల్కర్ రికార్డులను అధిగమిస్తూ టీమిండియాలో చోటు దక్కించుకోవడంతో వైభవ్ కుటుంబంలో, అతడి స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అటు క్రికెట్ అభిమానుల్లో కూడా వైభవ్లో సచిన్ను చూస్తామనే ఆశ మొదలైంది. సచిన్ వలే క్రికెట్ దిగ్గజాలు వైభవ్ ఆట తీరును మెచ్చుకుంటున్నారు. ఇదే పట్టుదల, క్రమ శిక్షణతో వైభవ్ తన ఆటను కొనసాగిస్తే ఎన్నో రికార్డులు బద్దలవడం ఖాయమని క్రికెట్ ప్రేమికులు అంచనా.
The post డబ్బు కంటే గౌరవమే ముఖ్యం appeared first on Visalaandhra.


