విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రాకపోకలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణం విజయవంతంగా పూర్తైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టడం జరిగింది.గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప, ప్రముఖులు కొర్రపాటి మల్లికార్జున ఆధ్వర్యంలో హిటాచీ, జేసీబీ యంత్రాలతో సుమారు 40 రోజుల పాటు నిరంతర కృషి చేసి కొండపైకి రహదారి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎత్తైన ప్రదేశం, రాళ్లతో నిండిన మార్గం వంటి సవాళ్లను అధిగమిస్తూ ఈ పనులను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం.
పనులు పూర్తైన సందర్భంగా గ్రామ ప్రజలు రాత్రింబవళ్లు శ్రమించిన యంత్రాల డ్రైవర్లను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ – “మాజీ సర్పంచ్ గోవిందప్ప కొర్రపాటి మల్లికార్జున పట్టుదలతో ముందుండి ఈ పనులను పూర్తి చేయడం వల్లే ఆలయానికి రహదారి సాధ్యమైంది” అంటూ వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ రహదారి నిర్మాణంతో వృద్ధులు, మహిళలు సహా భక్తులు ఇకపై సులభంగా కోండపైకి చేరుకుని స్వామి వారి దర్శనం పొందగలరని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన నాయకత్వాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు


