బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్లో క్రిమినల్ కేసులు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతోంది. హన్మకొండ రైతు సంగ్రామ సదస్సు వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చట్టపరమైన చిక్కులకు దారితీశాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్రెడ్డి తదితరుల ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కేటీఆర్పై బీఎన్ఎస్ యాక్ట్లోని సెక్షన్ 504 (శాంతి భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), సెక్షన్ 505 (ప్రజా విద్వేషాన్ని ప్రేరేపించే ప్రకటనలు చేయడం) కింద కేసులు నమోదు చేశారు.


