ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సీపీఐ ప్రతినిధి బృందం వినతి
విశాలాంధ్ర-హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృందం కలిసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఈటి నరసింహ, బాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం.బాలనరసింహ, వి.ఎస్.బోస్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఓ బృందంగా… వివిధ ప్రజా సమస్యలు పరిష్కరించాలని మెమోరాండం అందజేశారు. “ఇటీవల కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవటం శుభ పరిణామం. కానీ ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపు విషయంలో ‘కనీస వేతనాల కమిటి’ సిఫారసులను పరిగణనలోనికి తీసుకోకుండా వేతనాలు పెంచారు. ప్రకటించిన వేతనాల పెంపులో ప్రస్తుతం ఇస్తున్న వేతనాల కంటే మీరు ప్రకటించిన వేతానాలు తక్కువగా ఉన్నాయి. పున:పరిశీలన చేసి కనీస వేతనాల పెంపును సవరించాలి” అని కోరారు. సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రైతు భరోసా రబీకి రెండు ఎకరాల వరకే ఇచ్చారు. ఖరీఫ్ కూడా ప్రారంభవమవుతున్నందున వెంటనే రబీకి సంబంధించి రైతు భరోసా ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్క జొన్న కొనుగోలు చేయడాన్ని అభినందిస్తూ, రైతులకు వెంటనే మొక్క జొన్న డబ్బులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకతీతంగా పేదలకు అందేందుకు గ్రామసభలలో అర్హులను గుర్తించి, ఆ గ్రామానికి కేటాయించిన ఇళ్లకు లబ్ధిదారులను లాటరీ ద్వారా గుర్తించాలని, భూదాన భూములలో ప్రభుత్వ స్థలలాలో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 20వేల మంది గుడిసెవాసుల కోర్టు కేసులు పరిష్కరించి ఇళ్ల పట్టాలివ్వాలని, ఫీజు రీయింబర్స్మెంటును కొనసాగించి, బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రతినిధి బృందం కోరింది.


