వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు అనుకున్నంత పని చేశారు. ఇరాన్పై భారీస్థాయిలో దాడులు చేస్తామని ట్రంప్ చెప్పిన కొద్దిసేపట్లోనే ఆ హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తితలు తీవ్రమయ్యాయి. ఇరాన్లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇవి ట్రంప్ ఆదేశాల మేరకు కేవలం ఆత్మరక్షణ కోసం చేశామని పేర్కొంది. ఇరాన్లోని దక్షిణ ప్రాంతంలో భారీగా పేలుళ్లు జరిగాయి. మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్, టెహ్రాన్ ప్రాంతాలపై అమెరికా దృష్టిసారించింది. మరోవైపు కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రతినిధులు ప్రాధేయపడ్డారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే దీనిని ఇరాన్ కొట్టిపారేసింది. ఈవిడతలో దాడులు ముగిసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
సంతకం చేయకపోతే దాడులే అని చెప్పిన ట్రంప్…
అమెరికా ప్రతిపాదిత ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే రేపు రాత్రి దాడులు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు ఆ దేశ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. దీనికి తగినట్లే ఇరాన్లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకొంది. మొత్తం 49 తోమహాక్ క్షిపణలను ఈ దాడుల్లో వినియోగించినట్లు పేర్కొంది. ఇరాన్కు 64 కిలోమీటర్ల దూరంలోని కొన్ని లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. దీంతోపాటు ఫైటర్ జెట్లు కూడా దాడుల్లో పాల్గొని పర్షియన్ గల్ఫ్ వద్ద ఇరాన్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దెబ్బతీసినట్లు వెల్లడించింది.
దీటుగా స్పందించిన ఇరాన్…
అమెరికా దాడులకు ఇరాన్ దీటుగా స్పందించింది. హోర్మూజ్ జలసంధిని అన్నిరకాల నౌకలకు మూసివేసినట్లు ప్రకటించింది. రెండు చమురు ట్యాంకర్లపై కూడా ఐఆర్జీసీ దళాలు దాడులు చేశాయి. వాటికి అమెరికా యుద్ధనౌకలు సాయపడుతున్నట్లు ఆరోపించాయి. మరోవైపు కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. బహ్రెయిన్లోని షేక్ ఇసా ఎయిర్బేస్, కువైట్లోని అలీఅల్సలీమ్ ఎయిర్బేస్లపై డ్రోన్లు దాడి చేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. మా సార్వభౌమాధికారాన్ని మేం తగ్గించుకోమనే రీతిలో ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది.
The post ఇరాన్పై అమెరికా మళ్లీ భీకర దాడులు appeared first on Visalaandhra.


