ఇంధన ధరలు తగ్గించాలని ఖడ్గే డిమాండ్
న్యూదిల్లీ: ఇంధన ధరలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే మండిపడ్డారు. ముడి చమురు ధరలు తగ్గినా భారత్లో ఇంధన ధరలు ఎందుకు అధికంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ ప్రజలను దోచుకుంటోందని, జేబులను ఖాళీ చేస్తోందని ఆరోపించారు. ప్రజల్ని కేవలం పన్నుల వసూలు సాధనంగా మాత్రమే చూస్తోందంటూ ధ్వజమెత్తారు. యుద్ధం నెపంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలెండర్ ధరలను రెట్టింపు చేసిందని, ఇప్పుడు సరఫరా సాధారణ స్థితికి వచ్చినా ధరలను ఎందుకు తగ్గించడం లేదని ఖడ్గే నిలదీశారు. ‘పశ్చిమాసియాలో యుద్ధం ఉద్ధృతంగా ఉన్నప్ప్పుడు ముడి చమురు ధర బ్యారెల్కు 138 డాలర్లుగా ఉండేది. అప్పట్లో పెట్రోల్ లీటరు ధర రూ.94.77, డీజిల్ రూ.87.67గా ఉంది. క్రూడ్ ఆయిల్ ధర సగానికి సగం పడిపోయి ప్రస్తుతం బ్యారెల్ 70 డాలర్లకు తగ్గింది. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను మోదీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదు?’ అని ఖర్గే నిలదీశారు. యుద్ధం పేరుతో వాణిజ్య ఎల్పీజీ ధరలను రెట్టింపు చేశారని, ఇప్పుడు సరఫరా సాధారణ స్థితికి చేరినా ప్రజలకు ఎందుకు ఇంధన ధరలు తగ్గించడం లేదని ప్రశ్నించారు. వలస కార్మికులకు ఉపయోగకరమైన ఐదు కిలోల సిలిండర్ల ధరలనూ విపరీతంగా పెంచేశారని దుయ్యబట్టారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్కు అనుగుణంగా దేశంలో ఇంధన ధరలు తగ్గించాలని ఖడ్గే డిమాండ్ చేశారు.
The post అక్కడ తగ్గినా ఇక్కడ తగ్గించరా…? appeared first on Visalaandhra.


