పరీక్ష ముందురోజే ప్రశ్న పత్రం లీక్


మహారాష్ట్ర టెట్ వాయిదా
థానే (మహారాష్ట్ర):
దేశంలో మరో ప్రశ్న పత్రం లీక్ కలకలం రేపింది. మహారాష్ట్రలో ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’(టెట్) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీకైంది. దీంతో (నేడు) ఆదివారం జరగబోయే పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి తెలిపింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర పరీక్షల మండలి శనివారం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకత, నమ్మకత్వాన్ని కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మండలి స్పష్టం చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం…థానే రీజియన్ పరిధిలో టెట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు శనివారం తెల్లవారుజామున పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన భివండీ పోలీసులు ఒక రహస్య స్థావరంపై దాడి చేశారు. కొందరు వ్యక్తులు సీల్డ్ టెట్ క్వశ్చన్ పేపర్ ప్యాకెట్‌కు కలిగి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే పరీక్షల మండలి అధికారులను పిలిపించి ఆ పేపర్లను అసలు ప్రశ్నపత్రంతో సరిపోల్చి చూశారు. అవి లీక్ అయిన ఒరిజినల్ పేపరేనని తేలడంతో భివండీ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 1,028 కేంద్రాలలో ఆదివారం జరగాల్సిన ఈ పరీక్ష కోసం సుమారు 4.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని, కేంద్రాలకు బయలుదేరే సమయానికి పేపర్ లీక్ కారణంగా పరీక్ష వాయిదా పడడంతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు, ఆందోళనకు గురవుతున్నారు. దేశంలో పరీక్షల నిర్వహణపై నమ్మకం పోయిందని విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *