లాకప్ డెత్ – Visalaandhra


పోలీస్ కస్టడీలోనే సాయికృష్ణ మృతి

  • మృతదేహాన్ని మాయం చేశారు
  • తగులబెట్టారో, పూడ్చారో తెలియడం లేదు
  • సీఐ నాగరాజు తీవ్ర నేరానికి పాల్పడ్డారు
  • సీసీ ఫుటేజీ సహా సాంకేతిక ఆధారాలు ధ్వంసం చేశారు
  • హైకోర్టుకు సైతం తప్పుడు సమాచారం
  • దర్యాప్తుకు కూడా సహకరించడం లేదు
  • సిట్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
  • నాగరాజుకు 14 రోజుల రిమాండ్…రాజమండ్రి జైలుకు తరలింపు

విశాలాంధ్ర – విజయవాడ (క్రైం) : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ(25) కేసులో మిస్టరీ వీడింది. అతడిని పోలీసు స్టేషన్లోనే తీవ్రంగా హింసించి చంపేశారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రాథమికంగా నిర్ధారించింది. సాయికృష్ణ తీవ్ర గాయాలతో జూన్ 2వ తేదీకి ముందే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్‌లో చనిపోయినట్లు తమకు ఆధారాలు లభించినట్లు వెల్లడించింది. అయితే అతడి మృతదేహం ఇంకా లభ్యం కాలేదని తెలిపింది. తగులబెట్టారో, పూడ్చారో కూడా తెలియడం లేదని పేర్కొంది. ఈ కేసులో తొలి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ ఎస్ఎస్వీవీ నాగరాజు తీవ్ర నేరానికి పాల్పడ్డారని సిట్ స్పష్టం చేసింది. అతడు ఉద్దేశపూర్వకంగానే సీసీ ఫుటేజ్ సహా ఇతర సాంకేతిక ఆధారాలన్నీ ధ్వంసం చేశారని పేర్కొంది. అంతేకాకుండా హ్ఙెయస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపింది. ఈ మేరకు విజయవాడ రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్రేట్ట్ కోర్టుకు బుధవారం సిట్ 19 పేజీల నివేదిక సమర్పించింది. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును మంగళవారం అరెస్టు చేసిన సిట్ అధికారులు… బుధవారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రాథమిక విచారణ అనంతరం నాగరాజుకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ మేజిస్రేట్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
నివేదికలో సంచలన వివరాలు
కోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్ అనేక సంచలన విషయాలను వెల్లడించింది. ఆ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం… గాదె సాయికృష్ణపై కృష్ణలంక, మాచవరం పోలీస్ స్టేషన్లలో రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో మే 6వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు. 24 గంటల్లో నిందితుడిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా, ఆ విధంగా చేయలేదు. ఆ తర్వాత అతడి తల్లి విజయలక్ష్మీ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు తెలుసుకుని వచ్చింది. సీఐ నాగరాజును కలిసి తన కొడుకును చూపించాలని కోరగా, అతడు తీవ్రంగా దుర్భాషలాడారని మృతుడి తల్లి తెలిపింది. అదేవిధంగా సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో చూసినట్లు ఒక ఎస్ఐ సహా కొందరు పోలీసు సిబ్బంది కూడా సిట్‌కి చెప్పారు. ఆ సమయంలో అతడు తీవ్ర గాయాలతో ఉన్నాడని కూడా వెల్లడించారు. మొత్తం 17 మంది నుంచి వివరాలు సేకరించిన తర్వాత సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సిట్ నివేదికలో పేర్కొంది. సాయికృష్ణ ఆచూకీ పోలీసులు చెప్పకపోవడంతో మే 19న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మీ హైకోర్టులో హ్ఙెయస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించినా, తమ అదుపులో లేడని సీఐ తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పదారి పట్టించారు. అంతేకాకుండా ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మృతదేహాన్ని మాయం చేశారు. ఇప్పటి వరకు మృతదేహాన్ని ఏం చేశారనేది తెలియరాలేదు. స్టేషన్‌లో సీసీ ఫుటేజీ మే ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు డిలీట్ చేశారు. అంటే జూన్ 2వ తేదీకి ముందే సాయికృష్ణను చంపేసి ఉంటారు. సిట్ విచారణలో సీఐ నాగరాజు నోరు విప్పడం లేదు. ఏమి అడిగినా పొంతన లేని సమాధానాలు చెపుతున్నారు. అతడు బయట ఉంటే సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు రిమాండ్ విధించాలని సిట్ కోరింది.
సీఐ ఒక్కరి వల్ల సాధ్యమేనా?
సిట్ నివేదికలో సాయికృష్ణను లాకప్‌లో చంపేశారని తేలింది. అయితే మృతదేహాన్ని సీఐ ఒక్కరే మాయం చేయగలరా… ఇది సాధ్యమేనా… ఎవరు ఆయనకు సాయం చేసి ఉండరా… ఇప్పటి వరకు ఒక్క సీఐని మాత్రమే ఈ కేసులో అరెస్టు చేయడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మార్కాపురం వెళ్లి సాయికృష్ణను తీసుకురావాలని ఎవరు ఆదేశించారు… ఎవరు తీసుకొచ్చారు… ఎక్కడ ఎక్కడ తిప్పారు… సీసీ ఫుటేజ్ డిలీట్ చేయడానికి ఎవరు సహకరించారు… సీఐ నాగరాజు నోరు విప్పకపోవడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా… వంటి అనేక అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *