పాక్కు గట్టిగా బదులిచ్చిన విదేశాంగ శాఖ
న్యూదిల్లీ: పీఓకేలో ఆందోళనలతో పాటు సింధూ జలాల ఒప్పందానికి సంబంధించి పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ దేశం ఇలాంటి నీచ ప్రయత్నాలకు పాల్పడుతోందని మండిపడింది. పాక్ మంత్రి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని తేల్చి చెప్పింది. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ…ఈ ఆందోళనల వెనుక భారత్ ప్రభావం ఉందంటూ నోరు పారేసుకున్నారు. పాకిస్థాన్ నీటి భద్రతకు ముప్ప్పు వాటిల్లిందని భావిస్తే భారత్పై యుద్ధానికి వెనుకాడబోమని బీరాలు పలికారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జయశ్వాల్ మీడియా సమావేశంలో స్పందిస్తూ ఖవాజా వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు.‘తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఆ దేశంలో జరుగుతోన్న మావన హక్కుల ఉల్లంఘన నుంచి ప్రపంచం దృష్టి మళ్లించేందుకు పాక్ ఇలాంటి విఫల ప్రయత్నాలు చేస్తోంది. ఈ కల్పిత ఆరోపణలను మేం తోసిపుచ్చుతున్నాం. పాకిస్థాన్ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో (పీఓకేను ఉద్దేశిస్తూ) దశాబ్దాలుగా ఆర్థిక దోపిడీ కొనసాగుతోంది. అక్కడి ప్రజలు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారు. పాలనాపరమైన అణచివేత విధానాల ఫలితంగానే ప్రస్తుతం అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. ఆ ఆందోళనలపై పాక్ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోంది. అమాయక పౌరులపై కాల్పులు చేయడంతో పాటు ఔషధ సరఫరా, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ బలవంతపు చర్యల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దురాగతాలకు అంతర్జాతీయ సమాజం పాక్ను జవాబుదారీగా నిలబెడుతుందని ఆశిస్తున్నాం’ అని రణ్ధీర్ వెల్లడించారు.
The post తప్పులు కప్పిపుచ్చుకోవడానికి భారత్పై నిందలా? appeared first on Visalaandhra.


