నీట్ రీ-ఎగ్జామ్‌లో భారీ మోసం.. ఇతరుల తరఫున పరీక్ష రాసేందుకు వచ్చిన 9 మంది అరెస్ట్


బిహార్‌లో నిర్వహించిన నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
పలువురు అభ్యర్థుల స్థానంలో ఇతరులు పరీక్ష రాస్తున్నారనే అనుమానాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టగా మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో 9 మంది ఇతరుల తరఫున పరీక్ష రాస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సమాచారం ప్రకారం లఖిసరాయ్ జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో ఈ చర్యలు చేపట్టారు. కేఆర్‌కే హైస్కూల్ పరీక్షా కేంద్రంలో ఒకరు, కేంద్రీయ విద్యాలయంలో ఏడుగురు, హసన్‌పూర్ స్కూల్ కేంద్రంలో మరో వ్యక్తి డమ్మీ అభ్యర్థిగా పరీక్ష రాస్తుండగా పట్టుబడ్డారు. అరెస్టయిన వారు వివిధ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.

దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్,పోలీసు సూపరింటెండెంట్
డమ్మీ అభ్యర్థులతో పాటు పరీక్షలో అక్రమాలకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న మరో 21 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి మోసాల ముఠాతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టయిన వారిని ఎస్‌డీఎం ప్రభాకర్ కుమార్, ఎస్‌డీపీఓ శివమ్ కుమార్ పర్యవేక్షణలో విచారిస్తున్నారు. విచారణలో లభిస్తున్న సమాచారం ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ శైలేంద్ర కుమార్, పోలీసు సూపరింటెండెంట్ ప్రేరణ కుమార్ ఈ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం కూడా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మొత్తం మోసాల నెట్‌వర్క్ వివరాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

అక్రమాలకు 21 మంది సహకారం
ఎస్‌డీపీఓ శివమ్ కుమార్ మాట్లాడుతూ, నీట్ రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా మొత్తం 30 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.వారిలో తొమ్మిది మంది ఇతర అభ్యర్థుల తరఫున పరీక్ష రాస్తుండగా, మరో 21 మంది అక్రమాలకు సహకరించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలను అధికారులు వెల్లడించలేదు. అయితే విచారణ పూర్తయ్యాక ఈ అక్రమాల వెనుక ఉన్న పూర్తి ముఠాను వెలుగులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *