వేడెక్కిన ‘మహారాష్ట్ర’ రాజకీయాలు


ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలాబలాలు మరోసారి మారే అవకాశముంది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన(యÖబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. వారు ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఓ లేఖను అందజేశారు. ఈ ఫిరాయింపు లాంఛనమే కాగా…సంబంధిత ప్రక్రియ త్వరలోనే పూర్తయ్యే అవకాశముంది. ఫలితంగా లోక్‌సభలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బలం 13కు పెరుగనుంది. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌తో సమానంగా ఉంటుంది. మరోవైపు…9 స్థానాలతో బీజేపీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వస్తుంది.
మహాయుతిలో సయోద్యకుదిరేనా!
అయితే… బీజేపీ-షిండేలకు చెందిన మహాయుతి కూటమిలో ఈ పరిణామం నూతన ఒత్తిడులకు దారితీయవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహాయుతి పార్టీల నాయకుల మధ్య భేదాభిప్రాయాలు సమసిపోతాయాలేదన్నది అనుమానంగా ఉంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో షిండేకు ఉన్న అభిప్రాయ భేదాలపై ఇప్పటికే చర్చలు సాగుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో షిండే వర్గానికి మరింత ప్రాధాన్యం లభించే అవకాశమున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా…ఇటీవల ‘ఇక ఒకే శివసేన’ అని చేసిన వ్యాఖ్య కూడా ఈ రాజకీయ మార్పులకు నేపథ్యంగా భావిస్తున్నారు.
‘ఆపరేషన’ విజయవంతం: ఫడ్నవీస్
‘ఆపరేషన్ విజయవంతమైంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆత్మ విమర్శ చేసుకోవాల్సినవారు చేసుకుంటారు’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఒక ఆపరేషన్‌ను చేపట్టాక దానిని తాను ఎన్నడూ మధ్యలో విడిచిపెట్టబోనని, ఇప్పటికే దానిని రుజువు చేసుకున్నానని ఉప ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే చెప్పారు. శివసేన (యూబీటీ) ఎంపీల చీలికకు ‘ఆపరేషన్ టైగర’ కొనసాగుతోందన్న వార్తల నేపథ్యంలో ఆదివారం వారు ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘త్వరలోనే మీకు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఎంపీలను దూషించి, ఇప్ప్పుడు మీరు (ఠాక్రే శిబిరం) వారిని వెనక్కి రమ్మంటున్నారు. ఇదేం పద్ధతి…షిండే నేతృత్వంలోని శివసేన మాత్రమే పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే వారసత్వాన్ని కొనసాగిస్తోంది. శివసేన అంటే కేవలం పార్టీ కాదు…అది సిద్ధాంతాల సంక్రమిత ఆస్తి. వాటికి కొందరు తిలోదకాలు వదిలినప్పుడు ఆ సిద్ధాంతాలను నమ్ముకున్నవారంతా శివసేనను సజీవంగా ఉంచేందుకు షిండే నాయకత్వంలోకి వస్తున్నారు’ అని ఫడ్నవీస్ చెప్పారు.
నాదే అసలైన శివసేన: ఉద్ధవ్
ఉద్ధవ్ తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ…తన నేతృత్వంలో ఉన్నదే అసలైన శివసేన అని ప్రకటించారు. బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీ 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌తో పోరాడిందేగానీ ఆ పార్టీని అంతం చేయడానికి ఏనాడూ ప్రయత్నించలేదన్నారు. శివసేనకు అధినేతగా ఎవరుండాలో వెలుపలివారు నిర్ణయించలేరంటూ పరోక్షంగా కేంద్ర మంత్రి అమిత్ షాను ఉద్దేశించి అన్నారు.

The post వేడెక్కిన ‘మహారాష్ట్ర’ రాజకీయాలు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *