30న కౌలు రైతుల కోసం విజయవాడలో భారీ ధర్నా
చలో దిల్లీని విజయవంతం చేయాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
పెరిగిన ఎర్ర జెండా ప్రాముఖ్యత: ఈశ్వరయ్య
విశాలాంధ్ర`పెనుగంచిప్రోలు/ వత్సవాయి:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని, పోరాడే వారిదే ఎర్ర జెండా అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా ఉండాలని, పార్టీ చేపట్టన్ను ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సమావేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి శంకర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామకృష్ణ ప్రసంగిస్తూ అంతర్జాతీయ, జాతీయ రాజకీయ పరిణామాలను వివరించారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం శుభపరిణామమని రామకృష్ణ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని నరేంద్రమోదీ మోకరిల్లుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై మోదీకి ఏమాత్రం శ్రద్ధ కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 30వ తేదీన విజయ వాడలో భారీస్థాయిలో ఆందోళన నిర్వహి స్తామని, అందులో కౌలురైతులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆగస్టు ఆరో తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో పార్టీ నేతలు, శ్రేణులు చేపట్టన్ను పాదయాత్రను విజయవంతం చేయాల న్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ… దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా సెప్టెంబరు ఒకటో తేదీన చలో న్యూఢిల్లీ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో తరలిరావాలన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలన్నారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్నప్పటికీ… ఎర్రజెండా ప్రాముఖ్యత మాత్రం మరింత పెరుగుతుందని, ఎక్కడా తగ్గే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రశ్నించేత్తమూ, పోరాడే గుణమూ ఉన్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీనేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగిద్దామన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాలు తప్పవని స్పష్టంచేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు పదేపదే భూ సమీకరణకు వెళుతున్నారని, ఇది రైతులను దగా చేయడమేన్నారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే, మొదటి విడత భూముల్చిన రైతుల హక్కులను ముందుగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతుల నుంచి తీసుకున్న భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఈశ్వరయ్య చెప్పారు. దోనేపూడి శంకర్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకు వెనుకాడే ప్రసక్తేలేదన్నారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, అక్కినేని వనజ, పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవీ సత్యనారాయణమూర్తి, పి.హరినాథ్రెడ్డి, పి.దుర్గాభవాని, కె.రామాంజనేయులు, ఇతర కార్యదర్శివర్గ సభ్యుల, కార్యవర్గ, సమితి సభ్యులు, జిల్లాలు, నగరాల కార్యదర్శులు పాల్గొన్నారు.
The post పోరాడే వాడిదే ఎర్రజెండా appeared first on Visalaandhra.


