నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గిర్రాజు కాలనీ, 32వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన 100 కెవిఎ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, స్థానిక వార్డు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవానికి ముందు గిర్రాజు కాలనీలోని శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ధర్మవరం పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడమే తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిర్రాజు కాలనీలో గత కొంతకాలంగా లో వోల్టేజ్, తరచూ ఫ్యూజ్ బ్లోన్ అవ్వడం, ఓవర్లోడ్ కారణంగా విద్యుత్ అంతరాయాలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతం ఇప్పటివరకు ఒకే 100 KVA ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ పొందుతుండేదని, ఆ ట్రాన్స్ఫార్మర్పై 453 సేవల భారం పడటంతో సమస్యలు ఏర్పడినట్లు వివరించారు.
ఈ కొత్త ట్రాన్స్ఫార్మర్ ద్వారా 233 సేవలు నేరుగా లబ్ధి పొందుతున్నాయని, అందులో 178 గృహ వినియోగ సేవలు, 12 వాణిజ్య సేవలు, 3 పవర్లూమ్ సేవలు, 30 హ్యాండ్లూమ్ సేవలు ఉన్నాయని మంత్రి వివరించారు.
అలాగే ధర్మవరం అభివృద్ధికి అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు, పట్టణ అధ్యక్షులు చంద్ర, పట్టణ ఉపాధ్యక్షులు చెన్న ఆదినారాయణ, అంబటి సతీశ్, రాజా రెడ్డి, తాతిరెడ్డి సాయి, పాపన్న, కుంచేపు నారప్ప, రంగం శ్రీనివాసులు, రఘు, పోతుకుంట రాజు, తదితరులు పాల్గొన్నారు.


