మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్
విశాలాంధ్ర ధర్మవరం;; శాస్త్రీయ సమాజా నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదికలో భాగస్వామ్యం కావాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు జనవిజ్ఞాన వేదిక సభ్యత్వ గోడ పత్రికలను స్థానిక స్పందన హాస్పిటల్ లో జేవీవీ నాయకులు విడుదల చేసారు.
ఈ సంధర్భంగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డాక్టర్ మట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 39 సంవత్సరాలుగా తెలుగు ప్రజలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించాలని మానవత్వంతో జీవించాలని ఆకాంక్షిస్తూ శాస్త్ర ప్రచారంతో ప్రజలను చైతన్యం చేస్తోందన్నారు. నేడు ధర్మా ధర్మముల మధ్య, సత్యా సత్యముల మధ్య ఘర్షణ జరుగుతున్నది అని, ఈ ఘర్షణలో బుద్ధి జీవులు ఏ పక్షం వహించాలో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అని తెలిపారు. చివరకు జ్ఞానం అజ్ఞానాన్ని సత్యం అసత్యాన్ని తప్పక జయిస్తాయి అని, 100 సంవత్సరాల క్రితమే కందుకూరి వీరేశలింగం పంతులు అన్నాడన్నారు. ఈ పోరాటం ఈనాటికీ కొనసాగుతూనే ఉందన్నారు. జీవుల జన్యు నిర్మాణం గురించి వచ్చే రోగాల గురించి వాటి చికిత్స గురించి ఎంతో ముందుకు వెళ్ళాము కానీ ఇంకా మన సమాజంలో అశాస్త్రీయ భావజాలం రాజ్యమేలుతూనే ఉందన్నారు. దీనికి సైన్సు అందిస్తున్న ఫలితాలు సామాన్యుని వద్దకు చేరకపోవడమేనన్నారు. సైన్స్ అవగాహన పెంచడం ద్వారా సామాన్యులు సైన్స్ ఫలితాలను అందుకోవాలనే ఆలోచనలో నుంచి రాష్ట్రంలో జన విజ్ఞాన వేదిక ఏర్పడిందన్నారు. జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ బషీర్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరసారెడ్డి, లోకేష్ మాట్లాడుతూ తెలుగు ప్రజల్లో పనిచేస్తున్న అతి పెద్ద ప్రజాసైన్స్ ఉద్యమ సంస్థగా జనవిజ్ఞాన వేదిక అందరి అభిమానాన్ని పొందగలిగిందన్నారు.అక్షరాస్యత ,సారా వ్యతిరేక ఉద్యమం, కూల్ డ్రింక్స్ వ్యతిరేక ప్రచారం ,ఆరోగ్య ప్రచారం ,పిల్లల్లో సృజనాత్మకత కోసం ప్రయత్నాలు, పర్యావరణం వంటి అంశాలతో పాటు పిల్లలకు సైన్సు పట్ల అభిరుచి పెంచేందుకు చెకుముకి పత్రికను నిర్వహిస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సోనియా,జేవీవీ పర్యావరణ సబ్ కమిటీ కన్వీనర్ రామాంజనేయులు, కె .సురేష్, వేణుగోపాల్ రెడ్డి, హజివలి, సత్య నిర్ధారణ, శేషు,వసంతపురం నరేంద్ర, ఎల్ఐసి నారాయణస్వామి పాల్గొన్నారు.


