త్వరలో ట్రేడ్ డీల్: ట్రంప్


వాషింగ్టన్: త్వరలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) కుదరబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదే క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు మంచి మిత్రుడని చెప్ప్పుకొచ్చారు. భారత్‌లో అమెరికా వాణిజ్య బృందం పర్యటన పూర్తైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై తుది దశ చర్చల కోసం వచ్చిన యూఎస్ బృందం భారత అధికారులతో నాలుగు రోజుల (జూన్ 1-4) పాటు కీలక సమావేశాల్లో పాల్గొంది. అయితే భారత వాణిజ్య విధానాలను ట్రంప్ మరోసారి విమర్శించారు. అమెరికా విధానాలతో భారత్ లాభపడిందని చెప్పారు. అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించేదని అన్నారు. కానీ పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా తిరగబడిందని చెప్ప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత్ వల్ల యూఎస్ భారీగా లాభపడుతోందని చెప్పారు. వాణిజ్య ఒప్పందంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. ఫిబ్రవరి 7న ట్రంప్, మోదీ ఫోన్ కాల్ అనంతరం ఇరు దేశాల మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు అయిన విషయం తెలిసిందే. రష్యా చమురు కొంటున్నందుకు భారత్‌పై విధించిన 25 శాతం అదనపు సుంకాన్ని తొలగించడంతో పాటు తొలుత విధించిన 25 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపు రాజ్యాంగ బద్ధం కాదని సుప్రీం కోర్టు ఫిబ్రవరి 20న తీర్పు వెలువరించింది. దీంతో, ట్రంప్ మనుపటి సుంకాల స్థానంలో అన్ని దేశాలపైనా 10 శాతం సుంకం విధించారు. ఇది 150 రోజుల పాటు అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మరోసారి చర్చలు జరిపాయి. భారత బృందం అమెరికాలో పర్యటించగా తాజాగా అమెరికా బృందం భారత్‌కు వచ్చింది. ఇక ఈ ఒప్పందం దాదాపు కుదిరినట్టే అని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవలే పేర్కొన్నారు.

The post త్వరలో ట్రేడ్ డీల్: ట్రంప్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *