మళ్లీ డీలిమిటేషన్ బిల్లు?


. ప్రాంతీయ పార్టీలతో కేంద్రం రహస్య మంతనాలు
. 2029 ఎన్నికల లోపే పూర్తి చేయాలని యోచన
. ఏకాభిప్రాయం కోసం ముందస్తు చర్చలు

న్యూదిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మరోసారి పార్లమెంటు ముందుకు తెచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. 2029 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కసరత్తు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇది సున్నితమైన అంశం కావడంతో ఎలాంటి వివాదాలకు తావులేకుండా రాజకీయంగా ఏకాభిప్రాయం సాధించాలని ప్రభుత్వం యత్నిస్తున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ సంప్రదింపుల్లో భాగంగా కేంద్రం ఇప్పటికే తమిళనాడుకు చెందిన డీఎంకేతో పాటు వివిధ కీలక ప్రాంతీయ పార్టీలతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య 1971 జనాభా లెక్కల ఆధారంగా రూపొందించింది. కొత్తగా పునర్విభజన చేపడితే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరిగి, జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోతాయనే తీవ్ర ఆందోళనలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములాను రూపొందించేందుకు కేంద్రం యత్నిస్తోందని సమాచారం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురాగా… ఆ సమయంలో ప్రాంతీయ పార్టీల నుంచి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పార్లమెంటులో వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు వీగిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే.. ఈసారి బిల్లును నేరుగా సభలో పెట్టకుండా, ముందుగానే విస్తృత అవగాహన కుదిరిన తర్వాతే తదుపరి అడుగు వేయాలని కేంద్రం భావిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

The post మళ్లీ డీలిమిటేషన్ బిల్లు? appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *