వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన మండలి
వాయిదా తీర్మానాల తిరస్కరణ
పోడియం వద్ద నిరసనల హోరు
ఐలాపురం వెంకయ్య, రత్నబాయి మృతికి సంతాపం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇందాపూర్ డెయిరీ అంశంపై శాసన మండలి వైసీపీ సభ్యుల నిరసనలతో హోరెత్తింది. భోలేబాబా, హెరిటేజ్కు వ్యతిరేకంగా బుధవారం శాసన సభ ప్రాంగణం బయట నుంచి నినాదాలు చేస్తూ… మండలి లోపలికి వైసీపీ సభ్యులు ప్రదర్శనగా తరలివచ్చారు. కొందరి సభ్యులు పాల ప్యాకెట్లు చేతబట్టి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత మండలి ప్రారంభమవడంతో ఇందాపూర్ డెయిరీ కల్తీ ఆరోపణలపై చర్చించాలని వైసీపీ డిమాండ్… వాయిదా తీర్మానంపై వైసీపీ సభ్యులు భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం చర్చకు పట్టుపట్టగా, దాన్ని చైర్మన్ కొయ్యే మోషెన్రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు నిరసనల గళం వినిపించారు. తిరుమల లడ్డూలో కల్తీ ఆరోపణలపై వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ పోటీగా వాయిదా తీర్మానం ఇచ్చి మౌనంగా ఉన్నారు. చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఒకసారి వాయిదా తీర్మానాలను తిరస్కరించాక వాటిపై చర్చించాలంటూ నిరసనలకు దిగడం తగదంటూ చైర్మన్ సూచించినా వైసీపీ సభ్యులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ మండలిని కొద్దిసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ మండలి ప్రారంభం కావడంతో ప్రశ్నలన్నిటినీ డీమ్డ్గా చైర్మన్ ప్రకటించి, స్పెషల్ మెన్షన్కు అనుమతించారు. ఈలోగా వైసీపీ సభ్యులు మండలిలోకి ఒక్కసారిగా దూసుకొచ్చి ఇందాపూర్ డెయిరీపై చర్చించాలంటూ పోడియం వద్ద నినాదాలు చేశారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ విలువైన సమయాన్ని వధా చేయడం తగదని, ఏవైనా సమస్యలు ఉంటే చర్చించేందుకు సిద్ధమవ్వాలని, అనేక సార్లు మండలిని అడ్డుకోవడం వైసీపీ సభ్యులకు తగదని చెప్పారు.
హోం మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండగా… మండలిలో నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఎవరేమీ మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అప్పటికీ వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో మండలిని గురువారానికి వాయిదా వేశారు. తొలుత మండలి ప్రారంభ సమయంలో మాజీ ఎంపీ రత్నబాయి, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మతికి సంతాపం తెలిపింది. రెండు నిముషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు. మా పార్టీ నుంచి వైసీపీ ఎమ్మెల్సీలుగా ఎన్నికయిన బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ వాయిదా తీర్మానం ఇవ్వడం వింతగా ఉందని, వాళ్లిద్దరూ ఇప్ప్పుడు టీడీపీలో చేరారని, వారిని వైసీపీ సభ్యులుగా మంత్రి లోకేశ్ అనడం హాస్యాస్పదమని అన్నారు.
The post ఇందాపూర్ డెయిరీపై రచ్చ appeared first on Visalaandhra.


