ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నాం


– మంత్రి సత్యకుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం; ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ మరోసారి మానవత్వాన్ని చాటిచెప్పారు. అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మొత్తం 49 మంది లబ్ధిదారులకు రూ.23,44,467/- లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వారు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ వైద్య చికిత్సల కోసం అప్పులు చేసి, కుటుంబ పోషణకే ఇబ్బందులు పడుతున్న అనేక కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఊరటనిచ్చింది అని తెలిపారు. చెక్కులు అందుకున్న పలువురు లబ్ధిదారులు తమ కుటుంబ పరిస్థితిని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సరైన సమయంలో ప్రభుత్వం అందించిన ఈ సహాయం తమకు ప్రాణాధారంగా మారిందని మంత్రి సత్య కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి , ఎల్ఓసీల ద్వారా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు రూ.8,92,55,501/- కోట్ల మేర ఆర్థిక సహాయం అందించబడిందని మంత్రి తెలిపారు. శుక్రవారం పంపిణీ చేసిన రూ.23,44,467/- లక్షల సహాయంతో కలిపి మొత్తం రూ.9,15,99,968/- కోట్ల మేర ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం అందించామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు, బీజేపీ మండలాల అధ్యక్షులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, పార్టీ శ్రేణులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *