విశాలాంధ్ర–పెనుకొండ: మండల పరిధిలోని మోటువారిపల్లి గ్రామంలో బుధవారం రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత–జౌళి శాఖల మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు మండల కూటమి నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. గ్రామానికి తారు రోడ్డు సౌకర్యం కల్పించడం తో పాటు, దీర్ఘకాలంగా నెలకొన్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మంత్రి సవితమ్మ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి, వేగంగా అభివృద్ధి పనులు అమలు అవుతున్నాయని తెలిపారు.మంత్రి చొరవ వల్లే గ్రామ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయని నాయకులు అభిప్రాయపడ్డారు. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు నిర్మాణం పూర్తయితే గ్రామానికి నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఈశ్వర ప్రసాద్, కార్పొరేషన్ డైరెక్టర్లు కేశవయ్య, నారాయణస్వామి, సూర్యనారాయణ, పోతిరెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, నాగేంద్ర, శంకర్, రమణమ్మ, రామకృష్ణ, చంద్రకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.


