Last Updated:
వినూత్న రైతు పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్లో వినూత్న వ్యవసాయ పద్ధతులతో సరికొత్త మార్గాలను సృష్టిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన రైతులను గుర్తించి సత్కరించేందుకు ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2022 సంవత్సరం నుంచి ANGRAU స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది నాలుగు వినూత్న రైతు పురస్కారాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఏరువాక కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ & కోఆర్డినేటర్ డా. ఏ.ఆర్.కె. రావు తెలిపారు.
రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ ప్రాంతాలను ప్రతినిధ్యం వహించేలా పురస్కారాలను విభజించారు. ఉత్తర తీర ప్రాంతానికి ఒక పురస్కారం, దక్షిణ తీర ప్రాంతానికి ఒక పురస్కారం, రాయలసీమ ప్రాంతానికి ఒక పురస్కారం కేటాయించగా.. మహిళా రైతుల కోసం ప్రత్యేకంగా మరో అవార్డును ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో కొత్త పద్ధతులు అమలు చేసి ఆదర్శంగా నిలిచిన రైతులను ఎంపిక చేసి ఈ అవార్డులు అందజేయనున్నారు.
ఎంపికైన ప్రతి రైతుకు రూ.25 వేల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, సర్టిఫికేట్ను 2026 జూన్ 12న జరిగే ANGRAU స్థాపన దినోత్సవ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులు తమ పూర్తి బయోడేటా, సంబంధిత ఆధార పత్రాలతో కూడిన ఐదు హార్డ్ కాపీలను నిర్దేశిత నమూనాలో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తులను సమీపంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా జిల్లా ఏరువాక సలహా కేంద్రాలకు అందజేయాలని సూచించారు.
ముందుగా స్థానిక స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి, అర్హమైనవాటిని ప్రాంతీయ పరిశోధన సంచాలకులకు పంపించనున్నారు. అక్కడి నుంచి తుది పరిశీలన అనంతరం విశ్వవిద్యాలయానికి సిఫారసు చేయబడతాయి. దరఖాస్తుల సమర్పణకు మే 10, 2026 చివరి తేదీగా నిర్ణయించగా.. మే 14న స్థానిక కేంద్రాల్లో స్క్రీనింగ్, మే 20న ప్రాంతీయ స్థాయిలో పరిశీలన జరగనుంది.
ఈ అవకాశాన్ని చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వినూత్న ఆలోచనలతో వ్యవసాయంలో మార్పులు తీసుకొస్తున్న రైతులకు ఇది రాష్ట్ర స్థాయి గుర్తింపును తీసుకురానుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం జిల్లా ఏరువాక కేంద్రం, చిత్తూరు ప్రిన్సిపల్ సైంటిస్ట్ & కోఆర్డినేటర్ డా. ఏ.ఆర్.కె. రావును 9866021755 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh



