Last Updated:
నర్సీపట్నంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం, ట్యాంక్బండ్ తరహా చెరువు అభివృద్ధి, చంద్రబాబు నాయుడు ఆమోదంతో రోడ్లు, విగ్రహాలు, ఫౌంటెన్లు, లైటింగ్ పనులు వేగవంతం
అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం త్వరలోనే ఒక కొత్త పర్యాటక ఆకర్షణగా మారబోతోంది. సృష్టి క్షేత్రం పేరుతో 108 అడుగుల ఎత్తైన శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నర్సీపట్నాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇందులో భాగంగా పట్టణంలోని పెద్ద చెరువును హైదరాబాద్ ట్యాంక్బండ్ తరహాలో అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇటీవల ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పనులను పరిశీలించిన స్పీకర్, గతంలో ప్రభుత్వం మార్పుతో ఆగిపోయిన అభివృద్ధి పనులను మళ్లీ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించి, రోడ్డు అభివృద్ధి కోసం 3 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయించామని వెల్లడించారు.
ఈ పనులను ఏప్రిల్, మే నెలల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు ఒక కిలోమీటర్ మేర రోడ్డు విస్తరణ చేపట్టి, మధ్యలో బ్లాక్ రోడ్డు, ప్రజలు నడవడానికి ప్రత్యేక ఫుట్పాత్లు, చెరువు వైపు కూర్చునేందుకు సౌకర్యవంతమైన ప్లాట్ఫారాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మరో 6 కోట్ల 50 లక్షల రూపాయలతో ప్రఖ్యాత గాయకులు ఘంటసాల, సుశీల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. అదనంగా శివపార్వతుల విగ్రహానికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి శంఖు చక్ర నామాల విగ్రహాలు, మూడు ఆకర్షణీయమైన వాటర్ ఫౌంటెన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
సందర్శకుల కోసం టీ స్టాల్స్, చిన్న దుకాణాలు, రాత్రిపూట అందంగా మెరిసేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. నర్సీపట్నం ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే తమ లక్ష్యమని, ఈ అభివృద్ధి పనులకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


