విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. మే 6న నిర్వహించనున్న రథోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రథం ఫిట్నెస్ను పరిశీలించేందుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం ట్రాక్టర్ల సహాయంతో రథాన్ని లాగుతూ ట్రయల్ రన్ చేపట్టి, రథం బలం, చక్రాల స్థితి, తాడు వ్యవస్థ వంటి అంశాలను సవివరంగా పరిశీలించారు. అనంతరం రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్ నాగభూషణం రథం స్థితిగతులను సమీక్షించి, రథోత్సవం రోజున ఎలాంటి అవాంతరాలు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేవదాయ శాఖ అధికారులకు కీలక సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి రమేష్ బాబు, ఉరవకొండ ఎస్సై జనార్దన్ నాయుడు, ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథాచార్యులు, దేవాలయ పాలకమండలి సభ్యులు, దేవదాయ శాఖ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. రథోత్సవం రోజున భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా పకడ్బందీగా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
The post పెన్నహోబిలం రథోత్సవానికి సన్నాహాలు వేగం – రథం ట్రయల్ రన్ విజయవంతం appeared first on Visalaandhra.


