ఏపీపీఎస్సీలో అక్రమాల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27/2018 నోటిఫికేషన్ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 11న హైకోర్టులో రిట్ అపీల్, అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీఐడీ ఐజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్లో మరో సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తిని నియమించారు. దర్యాప్తునకు సంబంధించి సోదాలు చేసేందుకు, ఆధారాల స్వాధీనానికి సిట్కు అన్ని అధికారాలిచ్చారు. దర్యాప్తు అవసరాలకు ఏ ప్రభుత్వ శాఖ నుంచైనా అధికారుల నియామకానికి వెసులుబాటు కల్పించారు. ఈ ఏడాది మార్చి 16లోగా సిట్ తన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని సూచించారు.


