విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు హైస్కూల్ క్రీడా మైదానంలో లైటింగ్ సదుపాయం కల్పించేందుకు పెన్షనర్ల సంఘం ముందుకు వచ్చి రూ.10,000 విరాళాన్ని అందజేసింది. సాయంత్రం వేళల్లో చీకటి కారణంగా విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం అందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ట్రెజరీ అధికారి క్రిష్టప్ప, రిటైర్డ్ ఉపాధ్యాయులు వెంకటస్వామి, ఏర్రిస్వామి, వర్క్ ఇన్స్పెక్టర్ నజీర్ పాల్గొని, కళాశాల ప్రిన్సిపాల్ షాషావలి మరియు హైస్కూల్ హెడ్మాస్టర్ సత్యనారాయణలకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యాసంస్థల అభివృద్ధికి తమవంతు సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. క్రీడా మైదానంలో సరైన లైటింగ్ లేకపోవడం వల్ల విద్యార్థులు సాయంత్రం సమయంలో క్రీడా సాధన చేయడంలో ఇబ్బందులు పడుతున్నారని, అలాగే స్థానిక ప్రజలు వాకింగ్కు రావడంలో అసౌకర్యం ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.


