Last Updated:
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం విశాఖపట్నంలో జనసేన నేతలు, వీర మహిళలు సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు, శస్త్రచికిత్స విజయవంతం, పూర్తి కోలుకోవాలనే ప్రార్థనలు
ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షతో విశాఖపట్నంలో భక్తి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.
విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంపత్ వినాయక ఆలయంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. హోమం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల్లోకి రావాలని ప్రార్థించారు. గత కొన్ని నెలలుగా తీవ్రమైన పని ఒత్తిడితో బాధపడుతున్న ఆయనకు సైనసైటిస్ సమస్య ఎక్కువ కావడంతో, ఏప్రిల్ 18న హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. వైద్యుల ప్రకారం ఆపరేషన్ విజయవంతమై, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. అయితే పూర్తి కోలుకోవడానికి 7 నుంచి 10 రోజులపాటు విశ్రాంతి అవసరమని సూచించారు.
ప్రజల సమస్యల కోసం ఎప్పుడూ ముందుండే తమ నాయకుడు ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పనిచేస్తుంటారని జనసేన నాయకులు భావోద్వేగంగా పేర్కొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల కోసమే జీవించే నాయకుడు త్వరగా కోలుకోవాలని సంపత్ వినాయకుడి ఆశీస్సులు కోరుకున్నాం అని తెలిపారు.
ఇక వీర మహిళలు కూడా భావోద్వేగంగా స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ తమకు సొంత అన్నలాంటివారని చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగుపడాలని ప్రత్యేకంగా పూజలు, హోమాలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే విధంగా ప్రార్థనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
పూజ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయ కర్తలు, మహిళా కోఆర్డినేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు, జిల్లా నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ నాయకుడు త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని అందరూ ఒకే స్వరంతో ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


