Vijayawada: కుక్కకాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే.. డబ్బు కోసం సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ డ్రామా! షాక్ ఇచ్చిన రిటైర్డ్ టీచర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

అయితే, విజయవాడకు చెందిన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు మాత్రం సైబర్ నేరగాళ్ల పన్నాగాన్ని చిత్తు చేశారు. తన సమయస్ఫూర్తితో ఏకంగా పోలీసులకే సమాచారం అందించి, కేటుగాళ్ల గుట్టు రట్టు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Vijayawada: ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ (Digital Arrest) పేరుతో భయభ్రాంతులకు గురిచేసి లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. అయితే, విజయవాడకు చెందిన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు మాత్రం సైబర్ నేరగాళ్ల పన్నాగాన్ని చిత్తు చేశారు. తన సమయస్ఫూర్తితో ఏకంగా పోలీసులకే సమాచారం అందించి, కేటుగాళ్ల గుట్టు రట్టు చేశారు.

టెలికాం శాఖ పేరుతో వేధింపులు

ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడ యనమలకుదురు ప్రాంతంలో నివసిస్తున్న పసుపులేటి రవీంద్రనాథ్ ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు. ఈ నెల 15వ తేదీన ఆయనకు ఒక గుర్తు తెలియని నంబర్ నుండి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను టెలికాం శాఖ (Department of Telecommunications) నుండి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. “మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డును ఉపయోగించి బెంగళూరులో అమ్మాయిలతో అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, ముంబయిలో ఒక మానవ అక్రమ రవాణా (Human Trafficking) కేసులో కూడా మీ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు దొరికాయి” అని రవీంద్రనాథ్‌ను భయపెట్టాడు.

డిజిటల్ అరెస్ట్ డ్రామా

నేరగాళ్లు రవీంద్రనాథ్‌ను మానసికంగా దెబ్బతీయడానికి ‘డిజిటల్ అరెస్ట్’ డ్రామాను మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్ సెట్టింగ్‌ను తలపించే గదిలో ఉండి వీడియో కాల్ చేశారు. పోలీసు యూనిఫాంలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ.. తాము కేసును విచారిస్తున్నామని, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయన ఎవరితోనూ మాట్లాడకూడదని బెదిరించారు.

నిరంతర నిఘా: ప్రతి రెండు గంటలకు ఒకసారి తమకు మెసేజ్ చేయాలని, ఫోన్ కెమెరా ఆన్ చేసి ఉంచాలని ఆదేశించారు.

రహస్యంగా ఉంచాలని బెదిరింపు: ఈ విషయం బయటకు తెలిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, నేరుగా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.

రివర్స్ అటాక్ చేసిన వృద్ధుడు

రవీంద్రనాథ్ మొదట కంగారు పడినా, త్వరగానే తేరుకున్నారు. నేరగాళ్లు వీడియో కాల్‌లో చెబుతున్న విషయాలు, వారి ప్రవర్తన ఆయనకు అనుమానం కలిగించింది. నేరగాళ్లకు అనుమానం రాకుండా వారితో సరే అని చెబుతూనే, చాకచక్యంగా తన బంధువు సత్యప్రసన్నకుమార్ ద్వారా పటమట సీఐ పవన్ కిషోర్‌కు విషయం చేరవేశారు.

సమాచారం అందుకున్న సీఐ పవన్ కిషోర్ వెంటనే తన సిబ్బందిని రవీంద్రనాథ్ ఇంటికి పంపారు. నేరగాళ్లు మళ్లీ రవీంద్రనాథ్‌కు వీడియో కాల్ చేయగా, ఈసారి పక్కనే ఉన్న పటమట పోలీసులు ఫోన్ అందుకుని మాట్లాడారు. అవతలి వైపు ఉన్నది పోలీసులని తెలియగానే సైబర్ నేరగాళ్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే వీడియో కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు.

పోలీసుల అభినందనలు

సైబర్ నేరగాళ్ల పన్నాగానికి భయపడకుండా, నేర్పుగా వ్యవహరించి మోసాన్ని అడ్డుకున్న రవీంద్రనాథ్‌ను పటమట సీఐ పవన్ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. సైబర్ మోసగాళ్ల కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. “పోలీసులు గానీ, సీబీఐ అధికారులు గానీ ఎప్పుడూ ఇలా వీడియో కాల్స్‌లో అరెస్ట్ చేయరని, ఇలాంటి కాల్స్ వస్తే అవి నూటికి నూరు శాతం మోసపూరితమైనవేనని” ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నేరగాళ్ల ఫోన్ నంబర్లు, బ్యాంక్ వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ద్వారా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే సైబర్ నేరగాళ్ల ఆట కట్టించవచ్చని రవీంద్రనాథ్ నిరూపించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *