అలలపై ఆగిన జీవితం.. వేట నిషేధంతో తీరానికి పరిమితమైన పడవలు..! Visakhapatnam fishing ban. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్ర వేట నిషేధం, 700కి పైగా బోట్లు తీరానికే, మత్స్యకారులకు 20 వేల సాయం, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

+

రెండు

రెండు నెలలపాటు చేపల వేట నిషేధం..! హార్బర్ లో చేపలు ఉండవు..!  కారణం ఇదే

ఎప్పుడూ జనాలతో కిక్కిరిసిపోయే.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఒక్కసారిగా తగ్గిపోయింది. సముద్రపు అలలపై సాగే జీవన గమనానికి తాత్కాలిక విరామం లభించింది. ఏటా ఆనవాయితీగా అమలు చేసే సముద్ర వేట నిషేధ కాలం ప్రారంభం కావడంతో మత్స్యకారుల పడవలు జెట్టీలకే పరిమితమయ్యాయి. మత్స్య సంపదను కాపాడుకోవడం, చేపల పునరుత్పత్తి సజావుగా జరిగేలా చూడడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కీలక నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి.

భారత మత్స్యశాఖ ఆదేశాల మేరకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సుమారు రెండు నెలలపాటు సముద్రంలో వేట నిషేధం అమలులో ఉంటుంది. ఈ కాలంలో చేపలు గుడ్లు పెట్టే ముఖ్యమైన దశ కావడంతో వేట పూర్తిగా నిలిపివేయాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్‌లోని అన్ని మెకనైజ్డ్ బోట్లు తీరానికే చేరుకుని జెట్టీల వద్ద నిలిచిపోయాయి.

మత్స్యకార నాయకుడు జానకిరామ్ మాట్లాడుతూ, ఈ రెండు నెలలపాటు బోట్లు సముద్రంలోకి వెళ్లవని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మత్స్య సంపద సంరక్షణకు ఎంతో అవసరమని తెలిపారు. అయితే ఈ కాలంలో మత్స్యకారులకు ఉపాధి లేకపోవడం ఒక పెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు.

విశాఖ హార్బర్‌లోని సుమారు 700కు పైగా మెకనైజ్డ్ బోట్లు ఇప్పటికే తీరానికి చేరుకున్నాయి. ఈ విరామాన్ని ఉపయోగించుకుంటూ మత్స్యకారులు తమ వలలను భద్రపరచడం, పడవలకు మరమ్మతులు చేయించడం, ఇంజిన్ పనులు, పెయింటింగ్ వంటి పనులతో నిమగ్నమయ్యారు. సాధారణంగా ఎప్పుడూ రద్దీగా ఉండే హార్బర్ ఇప్పుడు నిశ్శబ్దంగా మారడం గమనార్హం.

ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ మత్స్యకారులందరూ వేట నిషేధాన్ని కచ్చితంగా పాటిస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ రెండు నెలలపాటు ఉపాధి కోల్పోయే కుటుంబాలను ప్రభుత్వం సకాలంలో ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. వేట నిషేధ భృతి ఆలస్యం కాకుండా అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వేట నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా సముద్రంలోకి వెళ్లితే కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తూ, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

మొత్తానికి ఈ రెండు నెలలు మత్స్యకారులకు విరామ కాలమైనప్పటికీ, సముద్రంలోని జీవ వైవిధ్యానికి ఇది అత్యంత కీలక సమయం. వేట నిషేధం ముగిసిన తర్వాత మళ్లీ అలలపై జీవితం పునఃప్రారంభం కానుండగా, ప్రస్తుతం మాత్రం విశాఖ తీరంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *