రాయలసీమలో చింతపండు బంగారం.. మహిళలకు వేలాది ఉద్యోగాలు ఇస్తున్న భారీ వ్యాపారం..! tamarind business. | అనంతపురం వార్తలు (Anantapuram News)


Last Updated:

రాయలసీమలో చింతపండు ప్రధాన వాణిజ్య పంటగా మారి వేలాది మందికి ఉపాధి ఇస్తోంది, గింజలతో తయారయ్యే టామరిండ్ కెర్నల్ పౌడర్‌కు పరిశ్రమల్లో భారీ డిమాండ్ ఉంది

+

గ్రామీణ

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి ప్రధాన ఆధారంగా మారిన చింతపండు…

రాయలసీమ ప్రాంతం అంటే చింత చెట్లకు ప్రసిద్ధి. అక్కడి వాతావరణం ఈ చెట్ల పెరుగుదలకు అనుకూలంగా ఉండటంతో చింతపండు ఒక ప్రధాన వాణిజ్య పంటగా ఎదిగింది. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఈ వ్యాపారం ఎంతటి స్థాయిలో ఉందో అక్కడి వ్యాపారి బాదుల్లా చెప్పిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్న ఆయన అనుభవం చూస్తే, చింతపండు వ్యాపారం కేవలం పంట కాదు.. వేలాది మందికి జీవనాధారం.

హిందూపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో చింతపండు మార్కెట్ భారీ స్థాయిలో కొనసాగుతోంది. స్థానిక ప్రాంతాలే కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్దఎత్తున చింతపండు ఇక్కడికి చేరుతుంది. నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు కూడా అందుబాటులో ఉండటం వల్ల వ్యాపారం మరింత విస్తరించింది. పుంగనూరు, పలమనేరు ప్రాంతాలు చింతపండు గింజల వ్యాపారానికి హబ్‌లుగా మారాయి. ఇక్కడ గింజల నుంచి పౌడర్ తయారు చేసే మిల్లులు అధికంగా ఉండటం ప్రత్యేకత.

చింతపండును విత్తనం ఉన్నది, గింజలు తీసినది అంటూ వేర్వేరు రకాలుగా విభజించి విక్రయిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో గింజలేని చింతపండు కిలో రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతుండగా, గింజలతో ఉన్నది రూ.20 నుంచి రూ.40 మధ్యలో ఉంది. చింత గింజలు కూడా కిలోకు రూ.30 నుంచి రూ.45 వరకు ధర కలిగి ఉండటం ఆశ్చర్యకరం. ఒకప్పుడు వ్యర్థంగా భావించిన గింజలు ఇప్పుడు పరిశ్రమలకు కీలక ముడిసరుకుగా మారాయి.

ఈ చింత గింజలతో తయారయ్యే టామరిండ్ కెర్నల్ పౌడర్‌కు టెక్స్‌టైల్, లెదర్, పేపర్ పరిశ్రమల్లో భారీ డిమాండ్ ఉంది. జిగురు తయారీలో దీనిని వినియోగించడం వల్ల గింజలకూ ప్రత్యేక విలువ వచ్చింది. గింజలను సేకరించి ఫ్యాక్టరీలకు సరఫరా చేయడం కూడా ఒక లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఇలా చింతపండు ప్రతి భాగం ఆదాయం తెచ్చే వనరుగా మారింది.

ఈ వ్యాపారంలో మహిళల పాత్ర అత్యంత కీలకం. చింతపండు వలవడం, గింజలు తీయడం, పీచు తొలగించడం వంటి పనుల్లో వేలాది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ప్రాసెసింగ్ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. పండును శుభ్రం చేసి రౌండ్ బిళ్లలుగా లేదా ప్యాకెట్లుగా మార్చడం వల్ల మార్కెట్లో మంచి ధర పొందుతున్నారు.

అంతేకాకుండా శుభ్రం చేసిన చింతపండును అర కిలో, కిలో ప్యాకెట్లుగా చేసి స్థానిక దుకాణాలకు సరఫరా చేయడం, సీజన్ తర్వాత ధర పెరిగినప్పుడు అమ్మేందుకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయడం వంటి పద్ధతులు వ్యాపారులకు అదనపు లాభాలు తెస్తున్నాయి. పట్టణాల్లో రెడీమేడ్ చింతపండు పేస్ట్‌కు పెరుగుతున్న డిమాండ్ చిన్న తరహా పరిశ్రమలకు దారితీస్తోంది.

ఇక చింతకాయలతో పచ్చళ్లు తయారు చేసి విక్రయించడం కూడా మంచి ఆదాయ మార్గంగా మారింది. ప్రభుత్వ సంస్థలు అయిన SERP, MEPMA ద్వారా మహిళా సంఘాలకు రుణాలు, శిక్షణలు అందించడంతో ఈ రంగం మరింత విస్తరిస్తోంది. చింతపండు ప్రాసెసింగ్ యూనిట్లు గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధికి మార్గం చూపుతున్నాయి. మొత్తానికి చింతపండు వ్యాపారం రాయలసీమలో కేవలం వ్యవసాయం మాత్రమే కాదు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే శక్తిగా మారింది. చిన్న పండుగా కనిపించే చింతపండు, వేలాది కుటుంబాలకు ఆదాయం అందిస్తూ జీవనోపాధికి బలమైన ఆధారంగా నిలుస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *