శ్రామిక లోకానికి ‘అక్షయపాత్ర’.. బాల్యానికి ‘ఆరోగ్య వనం


నేడు రాప్తాడులో అన్నా క్యాంటీన్, చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభం
పాల్గొననున్న ఎమ్మెల్యే పరిటాల సునీత, ఇన్చార్జ్ ధర్మవరపు మురళి

విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రం రాప్తాడు నేడు సరికొత్త అభివృద్ధి హంగులను సంతరించుకోనుంది. నిరుపేదలు, శ్రామిక లోకానికి ఆకలి తీర్చే అక్షయపాత్ర ‘అన్నా క్యాంటీన్’, చిన్నారుల శారీరక దారుఢ్యం కోసం ఏర్పాటు చేసిన ‘పరిటాల రవీంద్ర చిల్డ్రన్స్ పార్క్’ నేడు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, టిడిపి మండల ఇన్చార్జ్ ధర్మవరపు మురళి విచ్చేసి వీటిని ప్రజలకు అంకితం చేయనున్నారు. ​నాడు “ప్రజలే దేవుళ్లు – సమాజమే దేవాలయం” అనే మహోన్నత నినాదంతో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, పేదల కడుపు నింపేందుకు రూ.2కే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు అదే దారిలో, మార్కెట్‌లో పెరిగిన ధరల దృష్ట్యా సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు రూ.5 కే భోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు.

​ శ్రామిక శక్తికి ‘అక్షయపాత్ర’.. బాల్యానికి ‘ఆరోగ్య వనం’!

​సమాజ గమనంలో కీలకమైన వ్యవసాయదారులు, శ్రామికులు మరియు కర్షక వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టులను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దింది.
​జాతీయ రహదారి ప్రయాణికులకు, వాహన చోదకులకు వరంలా మారనుంది.
44వ జాతీయ రహదారి పక్కనే అన్నా క్యాంటీన్
ఉండటంతో, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు, వాహన చోదకులకు, లారీ క్లీనర్లకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం లభించడం వారికి పెద్ద ఊరట.

​ భవన నిర్మాణ, ఆటోనగర్ శ్రామికులకు ఆసరా:

రాప్తాడులో అధిక సంఖ్యలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు, ఆటోనగర్‌కు పనుల నిమిత్తం వచ్చే మెకానిక్కులకు ఈ క్యాంటీన్ ఒక గొప్ప వరంగా మారనుంది.

​ పస్తులు లేని శ్రామిక లోకం:

పొలం పనుల కోసం తెల్లవారుజామునే ఇళ్లను వదిలి వచ్చే రైతు కూలీలు ఆకలితో అలమటించకూడదనే సంకల్పంతో ఈ క్యాంటీన్‌ను అందుబాటులోకి తెచ్చారు. కేవలం రూ.5 కే భోజనం అందించడం ద్వారా శ్రామికుడి గౌరవాన్ని కాపాడడమే ఈ పథకం పరమావధి.

​ దృఢంకానున్న రేపటి పౌరులు

కేవలం ఆటలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంత చిన్నారులు శారీరక వ్యాయామం ద్వారా దృఢంగా తయారవ్వాలనే లక్ష్యంతో ‘పరిటాల రవీంద్ర చిల్డ్రన్స్ పార్క్’ రూపుదిద్దుకుంది. కర్షక బిడ్డలకు సైతం నగర స్థాయి వసతులు అందాలన్న ఉద్దేశంతో, ఆధునిక వ్యాయామ పరికరాలు మరియు సుందరమైన ఆట స్థలాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ​ఈ రెండు సౌకర్యాలు అందుబాటులోకి రావడం పట్ల మండల రైతాంగం, వాహన చోదకులు, మెకానిక్కులు, కార్మికులు మరియు సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *