కోల్కతా: పశ్చిమ బెంగాల్ సమగ్రతను దెబ్బతీసి, రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి కొన్ని ప్రాంతాలను ఒడిశాలోనో, బిహార్లోనో కలపాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. అలా జరిగితే బెంగాల్ ప్రజలు వేధింపులకు గురవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. తనను గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. బాంకుడా, తూర్పు బర్ధమాన్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె ప్రసంగించారు. మైనారిటీ ఓట్లను చీల్చి తమను ఓడించడానికి బీజేపీ నేత సువేందు అధికారితో కలిసి ‘ఆమ్ జనతా ఉన్నయన’ పార్టీ చీఫ్ హుమాయూన్ కుట్ర పన్నారని ఆరోపించారు. దీనిపై వైరల్ అయిన వీడియోను ఆమె ప్రస్తావించారు. రూ.200 కోట్లను హుమాయూన్ అడ్వాన్స్గా తీసుకున్నట్లు ఆ వీడియోలో ఉందని చెప్పారు. ఇది కల్పితమని కొందరు తోసిపుచ్చుతున్నా, ఆ క్లిప్లో ఉన్న వ్యక్తే అది సరైనదేనని ధ్రువకరించారని తెలిపారు. కేంద్ర సర్కారు ఈ ఏడాది కూలిపోతుందని జోస్యం చెప్పారు. మంత్రులు సహా తమ అభ్యర్థుల్ని బీజేపీ బెదిరిస్తోందని, మెజార్టీ మార్కును చేరుకోకపోతే మద్దతు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. ఓటింగ్ యంత్రాలపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


