ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఉపాధ్యాయుడు రవి కుమార్
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చెందుతున్నాయని ఉపాధ్యాయుడు రవి కుమార్ తెలిపారు. విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ఎంపీపీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, డిజిటల్ తరగతులు వంటి అనేక సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, విద్యా ప్రమాణాలు రోజురోజుకు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. మండలంలో నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని, విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలలు మరోసారి తమ ప్రాముఖ్యతను చాటుకుంటున్నాయని అన్నారు. అధికారులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషితో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు


