మూడవ రోజు కూడా విశేష స్పందన మధ్య కొనసాగిన ఉచిత కంటి పరీక్ష శిబిరం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పోతుకుంట వద్ద గల ప్రభుత్వ ఆసుపత్రిలో మూడవరోజు కూడా ప్రజల నుంచి విశేష స్పందన మధ్య ఉచిత కంటి పరీక్ష శిబిరం జరిగిందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు అక్కడకు చేరుకొని రోగులను ఆప్యాయతతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపికగా కంటి పరీక్షలు నిర్వహించుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మూడవరోజు 211 మంది కంటి పరీక్షలకు రోగులు రాగా, 73 మంది ఉచిత కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు.
మంత్రి ప్రత్యేక చొరవతో, సంస్కృతి సేవా సమితి సహకారంతో, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ద్వారా నిర్వహించామన్నారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రజల ఆరోగ్యంపై చూపుతున్న అంకితభావం వల్లే ఇలాంటి ఆధునిక వైద్య సేవలు స్థానికంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నిపుణుల పర్యవేక్షణలో కంటి పరీక్షలు , చికిత్సలు అందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ ఎంపికైన రోగులకు ఏప్రిల్ 12 నుండి 16 వరకు పూర్తిగా ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా వివిధ రకాల దృష్టి లోపాలతో బాధపడుతున్న 22 మందిని మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని బేస్ హాస్పిటల్కు రిఫర్ చేసినట్లు తెలిపారు. ఈ శిబిరం కొనసాగుతున్న రోజులలో ప్రజల నుంచి పెరుగుతున్న స్పందనను గమనించవచ్చని, ముఖ్యంగా వృద్ధులు మరియు పేద వర్గాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారిందని హరీష్ బాబు పేర్కొన్నారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎం.ఈ.ఎస్.యు భాను ప్రకాష్ రెడ్డి, శంకర నేత్రాలయ ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు, జిల్లా ప్రధానకార్యదర్శి సాకే ఓబులేష్, బత్తలపల్లి బిజెపి మండల అధ్యక్షులు భాస్కర్, బిజెపి నాయకులు అశ్వర్థనారాయణ, బీజేవైఎం నరేష్, పులకుంట్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.


