హిమాలయ ప్రాంతంలో ప్రతి ఏడాది నిర్వహించే అమర్నాథ్ యాత్రకు ముందస్తు నమోదులు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏర్పాట్లను శ్రీ అమరనాథ్ పుణ్యక్షేత్రం బోర్డు చేపడుతోంది. యాత్రకు వెళ్లే వారు తప్పనిసరిగా ఆరోగ్య ధ్రువపత్రం సమర్పించాలి. దేశవ్యాప్తంగా జమ్ముకశ్మీర్ బ్యాంకు,భారతీయ స్టేట్ బ్యాంకు,పంజాబ్ జాతీయ బ్యాంకు, ఎస్ బ్యాంకులకు చెందిన 554 శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తు నమోదు చేసుకోవచ్చు. బోర్డు నిబంధనల ప్రకారం పదమూడు సంవత్సరాల లోపు పిల్లలు, డెబ్బై సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు అనుమతి ఉండదు. అలాగే ఆరు వారాలకు మించిన గర్భంతో ఉన్న మహిళలు దరఖాస్తు చేయరాదు. యాత్రికులు ఐదుగురు నుంచి ముప్పై మంది వరకు సమూహంగా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది.


