అధికార స్థానాల ఎంపికలో సిబ్బందికి అన్యాయం: రాహుల్ గాంధీ
న్యూదిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు దళా(సీఏపీఎఫ్)ల్లో అధికార స్థానాలకు ఎంపిక విషయంలో సిబ్బందికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆ వివక్షను రూపుమాపి, ఉన్నతాధికారులుగా సీఏపీఎఫ్కు చెందిన వారినే నియమిస్తామని, బయటి నుంచి తీసుకురాబోమని హామీ ఇచ్చారు. సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఆ సంస్థ సిబ్బందికి రాహుల్గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ‘మావోయిస్టులు, ఉగ్రవాదులను ఎదుర్కోవడంతో పాటు ఎన్నికల నిర్వహణకు దశాబ్దాలుగా మీరు ఎన్నో త్యాగాలు చేశారు. అయినా మీకు రావాల్సిన సమయంలో పదోన్నతులు రావడం లేదు. మీ సంస్థల్లో నాయకత్వ స్థానాలకు బయటి వారిని ఎంపిక చేస్తున్నారు. ఇది ఉద్యోగాలకు సంబంధించినది కాదు. ఆత్మగౌరవానికి సంబంధించినది. మేము అధికారంలోకి వస్తే ఈ పరిస్థితిని మారుస్తాం’ అని ఎక్స్లో పేర్కొన్నారు. సీఏపీఎఫ్ పరిధిలో ఐదు రకాల దళాలు ఉండగా ఆ సిబ్బంది నియామకాలు, పదోన్నతుల పర్యవేక్షణకు ఏకీకృత వ్యవస్థను తీసుకురావాలని కేంద్రప్రభుత్వం ఇటీవల ఓ బిల్లును తీసుకొచ్చింది. దీనిని పార్లమెంటరీ జాయింట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేసినప్పటికీ, రాజ్యసభ, లోక్సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుతో సీఏపీఎఫ్కు పదోన్నతుల్లో నష్టం కలుగుతోందని వారి ఆవేదన.
The post సీఏపీఎఫ్లో వివక్ష appeared first on Visalaandhra.


