విశాలాంధ్ర ధర్మవరం::పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆర్వోప్లాంట్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి సతీమణి త్రివేణి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు శుద్ధమైన తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి వెంటనే స్పందించి, ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని తెలిపారు.ముఖ్యంగా మహిళలు, వృద్ధులు,చిన్నారులు సురక్షితమైన తాగునీటిని పొందడం ద్వారా రోగాల బారి నుండి తప్పుకోవచ్చని, ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన నీరు అందించడమే మంత్రి లక్ష్యమని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, ఇప్పటికే ఎన్నో గొప్పసేవాకార్యక్రమాలను విజయవంతంగా చేపడుతున్న సంస్కృతి సేవా సమితి ఇప్పుడు ఇందిరమ్మ కాలనీ ప్రజల దాహార్తిని తీరుస్తూ తన సేవా నిరతిని మరోసారి చాటుకుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.


