ఇంత వరకు వారిని ఎందుకు పంపలేకపోయారు: ఖడ్గే
సిల్చర్ (అసోం): రాష్ట్రంలో చొరబాటుదారుల పేరు చెప్పి బీజేపీ కాలయాపన చేసి రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం నుంచి చొరబాటుదారులను బీజేపీ చొరబాటుదారులను ఎందుకు వెనక్కి పంపలేకపోయిందని ప్రశ్నించారు. బీజేపీ, కేంద్రమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కచార్ జిల్లాలోని బోర్ఖోలాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘అసోంకు అమిత్ షా ఎప్ప్పుడు వచ్చినా బంగ్లాదేశ్ చొరబాటులదారులపైనే మాట్లాడతారు. అక్రమ వలసదారులను తరిమేయకపోగా వారిని పోషిస్తూనే వారి పేరుతో రాజకీయాలు చేస్తారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ.. 2005 నుంచి 2013 మధ్య 88,792 చొరబాటుదారులను దేశం నుంచి బహిష్కరించింది. మోదీ ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య 2,566 మంది అక్రమ వలసదారులను మాత్రమే తొలగించింది. బీజేపీ, మోదీ, అమిత్ షాలు ఎన్నికలు హామీలు ఇస్తారు కానీ వాటిని అమలుచేయరు. ఎన్నికల్లో గెలుపొందాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను భాజపా దుర్వినియోగం చేసింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో ముస్లింలు, దళితులు, ఆదివాసులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల నుంచి వారిని తొలగించి ఇతర వర్గాల ప్రజలను చేర్చారు. గ్రీన్ ఫీల్డ్ పేరుతో అసోంలో వేల ఎకరాలను బడా పారిశ్రామికవేత్తలకు మోదీ ప్రభుత్వం కట్టబెట్టింది. భూమి, అడవులు, నీరు, ఇంధనం, ఖనిజ సంపద, గనులు దోపిడీకి గురవుతున్నాయి. అవినీతిలో కూరుకుపోయిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. దేశాన్ని కాపాడాలంటే బీజేపీకి ఓటు వేయకూడదు’ అని ఖడ్గే పిలుపునిచ్చారు. పదేళ్ల బీజేపీ పాలన అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని గెలిపంచి అసోం అభివద్ధికి నడుం బిగించాలని ప్రజలను కోరారు.


