ధవీకరించిన పెంటగాన్ వర్గాలు
వాషింగ్టన్: ఒక వైపు ఇరాన్పై యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యాధ్యుక్షునిపై వేటు పడింది. ఆర్మీ జనరల్ ర్యాండీ జార్జ్ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరగా, ఆయన వెంటనే వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఆర్మీలోని అత్యున్నతస్థాయి అధికారిని పదవి నుంచి వైదొలగాలని హెగ్సెత్ కోరినట్లు తెలిపాయి. రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు హెగ్సెత్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులోభాగంగానే ఇప్పటివరకు డజను మందికి పైగా ఉన్నతస్థాయి జనరల్స్ను, అడ్మిరల్స్ను పదవి నుంచి తొలగించారు. పదాతిదళ అధికారి అయిన జార్జ్ వెస్ట్పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. మొదట గల్ఫ్ యుద్ధంతో సహా ఇరాక్, అఫ్గానిస్థాన్లలో కూడా సేవలందించారు. జో బైడెన్ హయాంలో 2021-2022 వరకు రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు సహాయకుడిగా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరిలో అనేకమంది ఉన్నతస్థాయి అధికారులను హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. నాడు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్గా ఉన్న జనరల్ చార్లెస్ సీక్యూ బ్రౌన్పై ట్రంప్ వేటు వేశారు. అప్పటినుంచి ఉన్నతస్థాయి సైనిక జనరల్స్, అడ్మిరల్స్ ముందస్తు పదవీవిరమణ చేయడం లేదా బాధ్యతల నుంచి తొలగించడం వంటివి చోటుచేసుకున్నాయి. ఇదిలాఉండగా… యూఎస్ దళాల రక్షణ కోసం హెగ్సెత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక స్థావరాల్లోకి వ్యక్తిగత ఆయుధాలు తీసుకెళ్లేందుకు సైనికులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.


