అసోం ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ
బొకాజన్: అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకట్టు కోవడానికి అనేక హామీలను గుప్తిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్టీల ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ ఎత్తుగడ వేసింది. ఎలాగైనా ఈ సారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఉన్న దారులన్నీ వెతుకుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆరోగ్యసంరక్షణ, పారిశ్రామికీకరణ సహా 11 కీలక రంగాలపై దృష్టి సారించి అస్సాం రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకొస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపారు. అస్సాంలోని బొకాజన్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను రాహుల్ గాంధీ విడుదల చేశారు. అంతకు ముందు గత నెల 29న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ప్రకటించిన ‘ఐదు గ్యారంటీ’లను ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం… కార్పొరేట్ సంస్థలకు భారీ స్థాయిలో కేటాయించిన భూములపై దర్యాప్తునకు అవినీతి నిరోధక కమిషన్ ఏర్పాటు చేస్తామని రాహుల్ ప్రకటించారు. అంకుర సంస్థలను తొలిసారి ప్రారంభించే అస్సాం యువతకు అండగా నిలిచేందుకు రూ.వెయ్యి కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వాటిపై విచారణ జరిపి, వాటిని పేదలకు పంచిపెడతామన్నారు.


