అమెరికా ప్రజలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, కానీ ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రభుత్వం తమతో ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ఆయన రాసిన బహిరంగ లేఖలో ఈ కీలక ఆరోపణలు చేశారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశ వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రజలతో సహా మరే ఇతర దేశ ప్రజలపైనా ఇరాన్ ప్రజలకు శత్రుభావం లేదు. తమ చరిత్రలో అనేక విదేశీ జోక్యాలను, ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఇరాన్ ప్రజలు ఎల్లప్పుడూ ప్రభుత్వాలను, ప్రజలను వేరుగానే చూశారు అని పెజెష్కియాన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇరాన్ తన ఆధునిక చరిత్రలో ఎన్నడూ ఆక్రమణలకు లేదా విస్తరణవాదానికి పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ను ఒక ముప్పుగా చిత్రీకరించడం అనేది పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న నేరాల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికి పన్నిన వ్యూహమని ఆరోపించారు.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని ఇంధన వనరులపై దాడులు చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో పెజెష్కియాన్ తీవ్రంగా స్పందించారు. తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే, అది ఇరాన్ ప్రజలను నేరుగా లక్ష్యం చేసుకోవడమే అవుతుందని, అటువంటి చర్యలను యుద్ధ నేరాలు గా పరిగణిస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ తన చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం ఆఖరి అమెరికన్ సైనికుడు, ఆఖరి అమెరికన్ పన్ను చెల్లింపుదారుడి డాలర్ వరకు పోరాడాలని చూస్తోంది. ప్రస్తుత అమెరికా ప్రభుత్వ ప్రాధాన్యం నిజంగా అమెరికా ఫస్టే నా? అని ఆయన ప్రశ్నించారు.
The post అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు appeared first on Visalaandhra.


