ఐపీఎల్‌లో డబ్బులు తక్కువ… షెడ్యూల్ ఎక్కువ


అందుకే ఆడట్లేదు
ఆడమ్ జంపా

ఇస్లామాబాద్: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా… ఐపీఎల్ 2026 వేలానికి దూరంగా ఉండటంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన నైపుణ్యానికి ఐపీఎల్‌లో సరైన విలువ, డబ్బు లభించడం లేదని, అందుకే ఈ లీగ్‌లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం జంపా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎసఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ జంపా తన అసంతృప్తిని బయటపెట్టాడు. “ఈ ఏడాది నేను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాను. నిజం చెప్పాలంటే, నా లాంటి నైపుణ్యం ఉన్న ఆటగాడికి ఐపీఎల్‌లో ఇతర నైపుణ్యాలు ఉన్నవారికి లభించేంత డబ్బు రాదు. ఐపీఎల్ కోసం చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ, అందుకు తగిన ప్రతిఫలం లేనప్పుడు అంత సమయం వెచ్చించడం సరైన నిర్ణయం అని నాకు అనిపించలేదు” అని జంపా వివరించాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎసఆర్‌హెచ్) జంపాను విడుదల చేయగా, అతను ఈసారి వేలం కోసం తన పేరును నమోదు చేసుకోలేదు. 2016లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో అరంగేట్రం చేసిన అతను, ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆరఆర్) జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 22 ఐపీఎల్ మ్యాచ్‌లలో 8.37 ఎకానమీ రేటుతో 31 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఏ సీజన్‌లోనూ ఆరు కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. పీఎసఎల్‌లో ఆడాలన్నది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయమని జంపా తెలిపాడు. మొదట విశ్రాంతి తీసుకోవాలని భావించినా, నెల రోజుల క్రితం పీఎసఎల్ నుంచి అవకాశం రావడంతో వెంటనే అంగీకరించానని చెప్పాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకే అవకాశం ఉంటుంది. దీంతో ఫ్రాంచైజీలు ఎక్కువగా పవర్ హిట్టర్లు, ఆల్-రౌండర్లు, ఫాస్ట్ బౌలర్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తాయి. స్పిన్నర్ల విషయంలో భారత్‌లో నాణ్యమైన స్థానిక ఆటగాళ్లు అందుబాటులో ఉండటంతో విదేశీ స్పిన్నర్లకు పెద్దగా డిమాండ్ ఉండటం లేదు. జంపా వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *