ఇంధన మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్
న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గణనీయంగా వంట గ్యాస్ కొరత పెరిగింది. దీనికి ప్రత్యామ్యాయాలపై కేంద్రం దష్టి సారించింది. వంట గ్యాస్ సమస్య తగ్గించే లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలకు ‘సుపీరియర్ కిరోసిన’ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్రాలకు కిరోసిన్ను కేటాయించింది. హోర్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కిరోసిన్ రహిత రాష్ట్రాలుగా ప్రకటించిన 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇంధన మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. కేవలం వంట, దీపాలు వెలిగించడం కోసమే షరతులకు లోబడి ఈ పంపిణీని చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో పాటు లైసెన్స్ పొందిన సర్వీస్ స్టేషన్లలో 5వేల లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. సుపీరియర్ కిరోసిన్ అనేది ముడిచమురు రిఫైనరీ ప్రక్రియ నుంచి వచ్చే ఉప ఉత్పత్తి. ఇది అత్యంత శుద్ధి చేసిన కిరోసిన్. దీన్ని ప్రధానంగా వంటకు, దీపాలు వెలిగించేందుకు వినియోగిస్తారు. సాధారణ లో-గ్రేడ్ కిరోసిన్తో పోలిస్తే ఇందులో నుంచి వెలువడే వాయువులు తక్కువ. పొగ కూడా తక్కువగా వెలువడుతుంది. సోలార్, ఎలక్ట్రికల్, బయోగ్యాస్ వంటి ప్రత్యామ్యాయాలు ఉన్నప్పటికీ అవి అన్నీ తక్షణం అందుబాటులోకి తీసుకురావడానికి కుదరదు.
The post రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపు appeared first on Visalaandhra.


