విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ): నార్పల మండల కేంద్రంలోని ఉయ్యాలకుంట కాలనీలో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన అంగన్వాడీ భవనాన్ని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అంగన్వాడీ భవనాలకు అనుమతులు మంజూరైనప్పటికీ పనులు పూర్తికాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఈ అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో అంగన్వాడీ భవనాల సమస్యను ప్రస్తావించినప్పటికీ, పనులు భౌతిక స్థాయిలో పురోగతి సాధించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.మండలంలోని అనేక అంగన్వాడీ భవనాలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉండటం దురదృష్టకరమని పేర్కొంటూ, పాలకులు వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్, సహాయ కార్యదర్శులు చాపల రామాంజి, సాకే సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దపెద్దయ్య సూరి తదితరులు పాల్గొన్నారు.


