-మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల బీమా పరిహారం అందజేత
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) l ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ లభిస్తుందని హంపాపురం కెనరా బ్యాంక్ మేనేజర్ రాజ్ కిరణ్ అన్నారు. గత జనవరి నెలలో గుండెపోటుతో అకాల మరణం చెందిన మరూరు గ్రామానికి చెందిన కోనయ్య, ఈ పథకంలో సభ్యునిగా చేరి ఉండటంతో ఆయన భార్య రాములమ్మకు రూ. 2 లక్షల బీమా క్లెయిమ్ మంజూరైంది. గురువారం కెనరా బ్యాంక్ వద్ద ఈ బీమా పరిహారాన్ని ఆమెకు అందజేశారు.
ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. అతి తక్కువ ప్రీమియంతో లభించే ఈ బీమా పథకం, కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆర్థిక భరోసాను కల్పిస్తుందన్నారు. ప్రతి ఖాతాదారుడు ఇటువంటి ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని, తమ పేరును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫీసర్ సృజన, సిబ్బంది శివారెడ్డి, తమన్నా, జిలాన్ బాషా, సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు జి. రామాంజనేయులు, బి. నరసానాయుడు, బీసీ శంకరయ్య మరియు గ్రామస్థులు, ఖాతాదారులు పాల్గొన్నారు.


