కొనసాగుతున్న ఇరాన్ఇజ్రాయిల్ దాడులు
తెల్ అవెవీ: యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినా...ఇరాన్ఇజ్రాయిల్ దేశాలు వెనక్కి తగ్గడంలేదు. యుద్ధానికి ఐదు రోజులు పాటు విరామం అంటూ…ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు కొనసాగించడం గమనార్హం. ఇరాన్లోని విద్యుత్తు కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగానే అంతర్జాతీయ సమాజం కాస్త ఊపిరి పీల్చుకుంది. వెంటనే చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒకింత కోలుకున్నాయి. ఇజ్రాయిల్ పై ఇరాన్ 78వ విడత దాడులు ప్రారంభించినట్లు ఐఆర్జీసీ తాజాగా ప్రకటించింది. ఇజ్రాయిల్లోని … డిమోనా, తెల్ అవెవీ, ఇలాట్తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. వాటిపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల్లో ఇజ్రాయిల్ కు చెందిన పలు ప్రాంతాలు ధ్వంసమైనట్లు పేర్కొంది. తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్ల మోత మోగుతోంది.
ఇరాన్ గ్యాస్ స్థావరాలపై దాడులు…
మరోవైపు ఇరాన్లోని రెండు గ్యాస్ స్థావరాలపై మంగళవారం దాడులు జరిగాయి. ఇస్ఫహాన్లోని గ్యాస్ వ్యవస్థ, ఖొర్రమ్షహర్లోని పవర్ ప్లాంట్ను క్షిపణులు, డ్రోన్లు తాకాయి. ఇవి ఎవరు చేశారన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై ఇజ్రాయెల్/అమెరికా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇది ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్ విద్యుత్ వ్యవస్థలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేసినా…ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగానే కన్పిస్తున్నాయి.
ఆ దేశాల నౌకలు హొర్మూజ్ గుండా వెళ్లొచ్చు…
హొర్మూజ్లో చమురు రవాణాపై ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ…తటస్థ దేశాల నౌకలు ఈ జలసంధి మీదుగా వెళ్లొచ్చని తెలిపింది. ఇందుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని పేర్కొంది. మరోవైపు, తమ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని కౌన్సిల్ హెచ్చరించింది.
The post ట్రంప్ తగ్గినా…మేం తగ్గం appeared first on Visalaandhra.


