హనుమంతరాయ చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: ప్రజా సమస్యల పరిష్కారాన్ని తన జీవిత ధ్యేయంగా తీసుకుని జీవితాంతం ప్రజాపక్షపాతిగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అజాతశత్రువుగా నిలిచారని, ఆయన మరణం టిడిపి పార్టీకి మాత్రమే కాకుండా కళ్యాణదుర్గం ప్రజలకు తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ పేర్కొన్నారు.ఆదివారం ఎర్రంపల్లిలోని హనుమంతరాయ చౌదరి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి జగదీష్తో పాటు సిపిఐ నాయకులు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ, హనుమంతరాయ చౌదరి జీవితాంతం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మహానేత అని కొనియాడారు. పార్టీ ప్రయోజనాలను కాపాడుతూ ప్రతిపక్ష పార్టీలతో కూడా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించిన అరుదైన నాయకుడని పేర్కొన్నారు. హనుమంతరాయ చౌదరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సంజీవప్ప, నియోజకవర్గ కార్యదర్శి జి.గోపాల్, సహాయ కార్యదర్శి నరసింహులు, సెట్టూరు మండల కార్యదర్శి తిమ్మరాయుడు, కళ్యాణదుర్గం పట్టణ సహాయ కార్యదర్శులు బుడేన్, సల్లావుద్దీన్, ఏఐఎస్ఎఫ్ తాలూకా కార్యదర్శి పవన్ తదితరులు పాల్గొన్నారు.


