విశాలాంధ్ర – నార్పల: మండల కేంద్రానికి చెందిన సాకే కృష్ణమూర్తి, కమలమ్మల కుమార్తె బుడగల ఉమాదేవి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కుటుంబ సభ్యులు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఏడాది క్రితం స్వర్గస్తురాలైన ఉమాదేవి జ్ఞాపకార్థం నార్పల మండల కేంద్రం సమీపంలోని సత్యసాయి ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులకు అన్నదానం నిర్వహించేందుకు రూ.4,000 నగదును అందజేశారు.దివంగత ఉమాదేవి భర్త, రాప్తాడు జర్నలిస్ట్ బుడగల శ్రీనివాసులు, కుమారుడు అక్షయ్ సాగర్, కుమార్తె నిత్యశ్రీలు కలిసి ఆశ్రమ నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా నిరుపేదలు, అనాధ పిల్లలకు అండగా నిలవడమే ఉమాదేవికి ఇచ్చే నిజమైన నివాళి అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆడంబరాలకు పోకుండా ఆమె స్మృతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.తోటి వారికి సాయం చేయడంలో ఉమాదేవి ఎప్పుడూ ముందుండేవారని, ఆమె ఆశయాలకు అనుగుణంగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సాకే రాజశేఖర్, కళావతి, తలారి కుమారి, శివ, హర్ష, లోహిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.


