బీజింగ్: అమెరికాకు చైనా ఓ షరతు పెట్టింది. పశ్చిమాసియాలో యుద్ధం ఆపేస్తే హోర్ముజ్ జల సంధిలో నౌకల రక్షణకు సిద్ధమని ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో తమకు మద్దతుగా యుద్ధనౌకలు పంపాలంటూ ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు చైనా స్పందించింది. ప్రపంచ ఇంధన సరఫరా, ప్రాదేశిక శాంతి, సుస్థిరతకు నష్టం కలిగించవద్దని సూచించింది. ఉద్రిక్తతలు పెరిగితే తీవ్ర పరిణామాలు తప్పబోవని హెచ్చరించింది. పరిస్థితి చేయిదాటనివ్వద్దని అమెరికాకు చైనా హితవుపలికింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత సైనిక ఘర్షణలు ముగిస్తేనే ప్రాంతీయ స్థిరత్వం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈనెలాఖరులో ట్రంప్ చైనా పర్యటనపై అమెరికాతో చర్చిస్తున్నట్లు లిన్ వెల్లడించారు. దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ఈ పర్యటన కీలకమన్నారు. ఇదిలావుంటే, అమెరికాకు సాయంగా తమ యుద్ధ నౌకలను పంపేందుకు బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాలు ఒప్ప్పుకోలేదు. ప్రాంతీయ యుద్ధంలోకి రాలేమని మిత్రపక్షాలు నిర్మొహమాటంగా చెప్పేయడంతో ట్రంప్ ఖంగు తిన్నారు. తనకు ఎవరి అవసరం లేదని ప్రకటించారు. ఒంటరిగానే రవాణా నౌకలకు రక్షణ కల్పించగలమని ప్రకటించారు. కలిసి వచ్చినా…రాకపోయినా గుర్తుపెట్టుకుంటామని ట్రంప్ తెలిపారు. చైనా పర్యటన వాయిదా వేస్తానంటూ బెదిరించారు. అయిత ఏ హోర్ముజ్ జల సంధితో చైనాకు అధిక ప్రయోజనమని, సుమారు 90 శాతం చమురు దిగుమతులు ఈ మార్గంలోనే సాగుతున్నాయని వెల్లడించారు. వ్యూహాత్మక జల మార్గాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని ఆయన చైనాను కోరారు.


