న్యూదిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరిన తృణమూల్ నేతలకు చుక్కెదురైంది. సమయాభావం వల్ల వారిని రాష్ట్రపతి కలవడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమబెంగాల్లో ఆదివాసీలకు అందుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి తెలియజేసేందుకు 12 మంది సభ్యులతో కూడిన టీఎంసీ బృందం అనుమతి కోరగా.. ఈ మేరకు సమాధానం వచ్చింది. అయితే, వచ్చే వారం అయినా తమకు రాష్ట్రపతి సమయం కేటాయించాలని కోరుతూ ఆ బృందం మరో లేఖను రాష్ట్రపతి భవన్కు పంపించినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ఉల్లంఘన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నాడు దీనిపై ముర్ము స్వయంగా అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉత్తర బెంగాల్లో అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని నాడు తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు సీఎం నుంచి గానీ.. మంత్రుల నుంచి గానీ అధికారిక స్వాగతం లభించలేదని పేర్కొన్నారు. తాను ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సిన ఆదివాసీ సదస్సుకు ఆ రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సులో ప్రసంగించడానికి రాష్ట్రపతి బెంగాల్లోని సిలిగురికిì వెళ్లిన సందర్భంగా ఈ పరిణామాలు చోటుచేసుకొన్నాయి.


