. గృహ ఎల్పీజీ సిలండర్లకు ఎటువంటి కొరతా లేదు
. జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ
విశాలాంధ్ర - ఏలూరు: ఏలూరు జిల్లాలో గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా ఎల్పిజీ సిలిండర్ల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయనీ, ఎటువంటి కొరతా లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను ఆసరాగా తీసుకొని ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం వంటి బ్లాక్ మార్కెటింగ్ చర్యలు ఎవరైనా చేపట్టినట్లయితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా అధికారులు కఠినంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రతి వినియోగదారునికి అవసరమైన గ్యాస్ సిలిండర్ అందేలా జిల్లా యంత్రాంగం మరియు ఆయిల్ కంపెనీలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాయి. ఏలూరు జిల్లాలో గృహ ఎల్పిజీ (LPG) గ్యాస్ సరఫరా ఎటువంటి కొరతా కొనసాగుతోందన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు నిరంతరంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాయనీ అలాగే డీలర్లు, డెలివరీ వ్యవస్థ ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఎల్పీజీ సరఫరా నిలిచిపోయిందని లేదా కొరత ఏర్పడిందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమన్నారు. ఇటువంటి వదంతులను నమ్మి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. . వదంతుల ప్రభావంతో కొంతమంది వినియోగదారులు ముందుగానే పెద్ద ఎత్తున రీఫిల్ బుకింగ్లు చేయడం వల్ల కొన్నిచోట్ల తాత్కాలికంగా బుకింగ్ మరియు సరఫరాలో స్వల్ప ఆటంకములు కలిగే ఆస్కారము కలదు అయితే ఇది గ్యాస్ కొరత కారణంగా కాకుండా అకస్మాత్తుగా పెరిగిన బుకింగ్ కారణంగా మాత్రమే జరుగుతోంది. ఏలూరు జిల్లా అంతటా ఎల్పీజీ గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతున్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రజలు అపోహలు, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని జేసీ విజ్ఞప్తి చేశారు.


