టీమిండియా నుండి ఒకే ఒక్కడు – Visalaandhra


‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ రేసులో సంజూ

న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. సెమీఫైనల్‌లో బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత్ ఘనంగా ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు భారత్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక సమయంలో, టోర్నీ పొడవునా అద్భుత ప్రదర్శన చేసిన ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లతో కూడిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట’ షార్ట్‌లిస్ట్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా సంజూ శాంసన్ నిలిచాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులో అవకాశం లేకపోయినా ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న సంజూ… కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 232 పరుగులు చేసి టీమిండియాకు అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ముఖ్యంగా సూపర్-8, సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాను ఫైనల్‌కు చేర్చడంలో కీలకంగా మారిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రేసులో సంజూతో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు కూడా గట్టి పోటీనిస్తున్నారు. వారిలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ 226 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి నాలుగు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ’ అవార్డులు గెలుచుకోగా, పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్జాదా ఫర్హాన్ 383 పరుగులతో (రెండు సెంచరీలు) ఈ ఎడిషన్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా నుంచి లుంగీ ఎన్గిడి తన పొదుపైన బౌలింగ్‌తో 12 వికెట్లు పడగొట్టగా, ఐడెన్ మార్‌క్రమ్ 286 పరుగులతో టాప్ ఆర్డర్‌లో నిలకడగా రాణించాడు.
న్యూజిలాండ్ ఫైనల్ చేరడంలో రచిన్ రవీంద్ర (11 వికెట్లు, 128 పరుగులు), టిమ్ సైఫర్ట్ (274 పరుగులు) ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఈ టోర్నీలో అసలైన సంచలనం అమెరికా బౌలర్ శాడ్లీ వాన్ షాక్విక్, అతను కేవలం 4 మ్యాచుల్లోనే 13 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేసులో ఉన్నవాళ్లకు అభిమానులు ఓటింగ్ ద్వారా తమకు నచ్చిన ఆటగాడిని ఎంచుకొని విజేతగా నిలపవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *